Sunday, September 6, 2015

"కొత్తపల్లి కథలు" అనే మ్యాగజైన్ లో మా పాఠశాల విద్యార్థిని కథ

రచన: జి. రాజేశ్వరి. ఐదవ తరగతి, మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాల, కంకణాల పల్లి, ప్రకాశం జిల్లా.
.
మేగజైన్ లో డైరెక్ట్ గా చూడడానికి  

అనగనగా ఒక ఊరిలో ఒక రంగయ్య ఉండేవాడు. ఒకసారి ఆ రంగయ్యకు ఓ పెద్దాయన ఓ కేలెండర్ ఇచ్చారు. రంగయ్య దాన్ని తెచ్చి ఇంట్లో మేకుకు తగిలించి, "బట్టలు కొనుక్కుంటే నయం" అనుకొని త్రిపురాంతకం వెళ్లాడు.అప్పుడు వాళ్ల ఇంట్లోకి ఓ కుక్క దూరింది. దూరగానే దానికి రంగుల రంగుల కేలెండరూ, దాన్ని తగిలించిన మేకూ కనిపించాయి. దానికి ఆ కేలెండరు బాగా పరిచయం ఉన్నట్లు అనిపించి, "దగ్గరికి వెళ్లి చూద్దాం" అని అక్కడికి వెళ్ళింది. అది తన దగ్గరికి రాగానే మేకుకు చాలా సంతోషం వేసింది- "కుక్కా! బాగున్నావా?" పలకరించింది మేకు. "ఏదో, ఉన్నాను. నువ్వు బాగున్నావా?" అంది కుక్క.
"నాకేమి? నేను మేకులాగా ఉన్నాను. చాలా బాగున్నాను " అన్నది మేకు.
"మీ క్యాలండర్ అచ్చంగా మా పాత ఇంట్లో క్యాలండరు లాగే ఉన్నది. మీ యజమాని ఫొటో ఉందా ఎక్కడైనా?" అడిగింది కుక్క."అదిగో, అక్కడ వ్రేలాడుతున్నది ఆయన ఫొటోనే" అంది మేకు."అయ్యో! మీ రంగయ్య చాలా చెడ్డవాడే, పాపం నీది కూడా నాలాంటి కష్టపు బ్రతుకేనన్నమాట!" అంది కుక్క రంగయ్య ఫొటోని చూస్తూ.
"ఏమీ లేదు. రంగయ్య చాలా మంచోడు. నీకెందుకు అట్లా అనిపించింది?" అడిగింది మేకు, ఆశ్చర్యపోతూ.
"మా యజమాని గురించి నీకు తెలీదు కదా, అచ్చం రంగయ్య లాగే ఉంటాడు. చాలా చెడ్డవాడు. మీ రంగయ్య కూడా ఆయన లాగే చాలా చెడ్డవాడు అయిఉంటాడు. ఇంకేమి?" అంది కుక్క."ఏమీ లేదే! రంగయ్య నన్ను ఏమీ అనడే?!" ఆశ్చర్యపోయింది మేకు.
"నువ్వైతే మేకువు- సరే. మరి మీ ఇంట్లో కుక్కను బాగా చూసుకుంటాడా, రంగయ్య?" అడిగింది కుక్క.
"మా ఇంట్లో కుక్కే లేదు అసలు! అదే ఉంటే‌ నువ్వు ఇక్కడ ఎట్లా నిలబడేదానివి?!" నవ్వింది మేకు.
"అదేంటి- రంగయ్య, మా యజమాని ఒకేలాగా ఉన్నప్పుడు, మీ ఇంట్లో కూడా నాలాంటి కుక్క ఉండాల్సిందేనే?!" అంది కుక్క, కుక్కలాగా ఆలోచించి.
మేకుకు ఏమనాలో తెలియలేదు. అప్పుడు గుర్తొచ్చింది- రంగయ్య బిడ్డ రోజూ చదివే పద్యం ఒకటి అప్పుడు అర్థమైంది దానికి. కుక్కని చూసి నవ్వుతూ అది చెప్పింది- "చూడు కుక్కా, ఉప్పు, కర్పూరం చూసేందుకు ఒకేలాగా ఉంటాయి. కానీ వాటి రుచులు పూర్తిగా వేరుగా ఉంటై. అట్లాగే మనుషులు కూడా-చూపులకు ఒకేలాగా ఉన్నా, మనసులు, ప్రవర్తన మటుకు వాటి ఇష్టం వచ్చినట్లు అవి ఉంటాయి. అందుకని మనిషుల్ని పరిశీలించకుండా, వాళ్ల రూపాన్ని బట్టి 'మంచి-చెడ్డ' అని చెప్పలేం తల్లీ!" అంది.మామూలుగా అయితే కుక్క ఏదో అనేదే గానీ, పద్యం విన్నాక ఇంక అనేందుకు ఏమీ లేక,"బాబోయ్! ఇది భలే మేకు" అనుకుంటూ వెళ్లిపోయింది.
5వ వతరగతి మా విద్యార్థి బి.రాజేశ్వరి రచించిన కథ
in SAKSHI daily paper dt.09-10-2015